మహిళల పై ఓ కొత్త చట్టం తీసుకువస్తానని సీఎం జగన్ సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ , సినీ నటి విజయశాంతి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. మహిళల భద్రత విషయంలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను అభినందిస్తున్నానని తెలిపారు. అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టం తీసుకురావాలని జగన్ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. అయితే ఏపీ తరహా చట్టాల్ని తెలంగాణలో కూడా తేవాలన్నారు విజయశాంతి.
ఇటీవల హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ పై జరిగిన అమానుష దాడితో యావత్తు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో ఏపీ అసెంబ్లీ లో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రతిపాదన చేసిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని అభినందిస్తున్నానని తెలిపారు. మహిళలకు అన్యాయం జరిగిన కేసుల్లో మూడువారాల్లోనే శిక్ష పడేలా చట్టం తీసుకువస్తామని జగన్ అన్నారు. బుధవారం చట్టానికి సంబంధించి కీలకమైన ప్రకటన చేస్తామని పేర్కొన్నారు.