పంజాబ్ ఉపఎన్నిక హీట్ రేపుతోంది. హోషియార్పూర్ జిల్లాలో ప్రధానమైన అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న ముకరియన్లో ఎవరి గెలుపు అంచనాలను వారు లెక్కలేసుకుంటున్నారు. ముకరియన్ సిట్టింగ్ (కాంగ్రెస్) ఎమ్మెల్యే రజనీష్ కుమార్ బాబీ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఆసక్తికరమైన విషయమేంటంటే.. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ పార్టీ ఈ ఉపఎన్నికకు దూరంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
1984లో బీఎస్పీ పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా 1992 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. 1992 నుంచి 2017 మధ్య కాలంలో ఏడుసార్లు ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేసింది. ఈ ప్రాంతంలో బీఎస్పీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. చివరిసారిగా 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగింది. తొలి నుంచి ప్రతీ పోలింగ్కి బీఎస్పీ తన ఉనికిని చాటుతూనే ఉంది. అయితే…ఈ ఉపఎన్నికకు బీఎస్పీ దూరం కావడంతో ఆ పార్టీకి చెందిన దళితుల ఓటు బ్యాంకు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్కే దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే…ఫాగ్వారా ఉపఎన్నికకు మాత్రం బీఎస్పీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఉప ఎన్నిక సమయంలో కేవలం ఒక సీటుపైనే దృష్టి పెట్టాలనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు.