బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాల్గొన్న దసరా ఉత్సవాలకు సీనియర్ బిజెపి నేతలు హాజరు కాలేదు. బిజెపి నాయకుడు, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీతో సహా బిజెపి నేతలెవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన దసరా ఉత్సవాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బిజెపి నేతలు హాజరు కాలేదు. వేదికపై ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ కోసం ఏర్పాటు చేసిన కుర్చీ చివరి వరకూ ఖాళీగానే ఉంది. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కూటమిగా ఉన్న ఇరు పార్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రితో సహా స్థానిక బిజెపి ఎమ్మెల్యే, బిజెపికి చెందిన మంత్రులు, ప్రముఖ నాయకులు గైర్హాజరయ్యారు.