వారం రోజుల క్రితం ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ తాజాగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన ఇవాళ ఢిల్లీ కోర్టులో లొంగిపోయారు. అనంత సింగ్ ప్రస్తుతం మోకామా నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పూర్వీకుల ఇంట్లో ఈ నెల 17న జరిగిన అకస్మిక సోదాల్లో ఓ ఏకే 47 రైఫిల్, గ్రనేడ్లు, బుల్లెట్లు లభించాయి. దీంతో అదే రోజు రాత్రి ఆయన ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యారు.
తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉన్నందున పోలీసుల ముందు కాకుండా కోర్టులోనే లొంగిపోతానంటూ ఓ వీడియో కూడా విడుదల చేశారు. గురువారం రాత్రి విడుదల చేసినట్టు చెబుతున్న ఈ వీడియోలో పాట్నా పోలీసులు, కొందరు నేతలపై సదరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాట్నా పోలీసులు, జేడీయూ ఎంపీ లలన్ సింగ్, మంత్రి నీరజ్ కుమార్, బాధ్ ఏఎస్పీ లిపి సింగ్ తదితరులు తనపై కుట్రపన్నారని ఆరోపించారు. జేడీయూ ఎంపీ లలన్ సింగ్ తనకు తెలియకుండా తన ఇంట్లో ఆయుధాలు పెట్టి వెళ్లారని పేర్కొన్నారు. కాగా కనిపించకుండా వెళ్లిపోయిన అనంత్ సింగ్ కోసం పాట్నా పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.