తన భర్త ఆరోగ్యం కోసం ఓ భార్యామణి చేసిన పని..సదరు భర్తకు వైవాహిక బంధం మీద విరక్తి పుట్టించింది. 'అయ్యా నాకు విడాకులిప్పించండి, నేను ఈ నరకం తట్టుకోలేక పోతున్నాను' అంటూ ఆ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. విడాకులు కోరడానికి అతడు చెప్పిన కారణం విని కోర్టువారు కూడా ముక్కున వేలేసుకున్నారు. అసలు కథేంటంటే..ఉత్తరప్రదేశ్ మీరట్కు చెందిన ఓ జంట పదేళ్ల క్రితం వివాహ బంధంలో అడుగుపెట్టింది. అయితే కొంత కాలంగా భర్త అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. అతడి పరిస్థితి చూసి చెలించిపోయిన భార్య..ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. తన భర్త ఆరోగ్యం బాగుచేయాలని తాంత్రికుడి వద్ద మొరపెట్టుకుంది. ఆమెకు అభయహస్తమిచ్చిన తాంత్రికుడు..ప్రతిరోజూ, రెండుపూటలా భర్తకు లడ్డూలు తినిపిస్తే అతడు తిరిగి ఆరోగ్యవంతుడవుతాడిన సెలవిచ్చాడు.
అంతే..ఆ దివ్యోపదేశాన్ని సదరు మహిళారత్నం ఆచరణలో పెట్టింది. భర్తకు చుక్కులు చూపించింది. ఈ నరకాన్ని తట్టుకోలేని భర్త మొదట భార్యపై కొప్పడ్డాడు. ఆ తరువాత బతిమలాడాడు. భార్య మాత్రం ఒక్క మెట్టుకూడా దిగలేదు. మీ ఆరోగ్యం కోసమే ఇదంతా అంటూ..మరింత కఠినంగా తాంత్రికుడి సలహాను పాటించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో...నాకు విడాకులింప్పిచండి అంటూ భర్త కోర్టు వారిని వేడుకున్నాడు. భర్త చెప్పిన కారణం విని మొదట వారు కూడా షాకయ్యరు. అయితే.. ఓ జంట విడిపోవడం చూడలేని వారు, దంపతులని కౌన్సెలింగ్కు పిలిపించారు. అయితే.. కాపురం కూలిపోయే స్థితికి వచ్చినా భార్య మాత్రం వెనక్కుతగ్గలేదు. 'లడ్డూయే సర్వరోగ నివారిణి, అదే తన భర్తను ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది.' అని ఆ అభినవసావిత్రి తేల్చిచెప్పడంతో వారు తలలు పట్టుకున్నారు. ఇద్దరి మధ్యా సయోధ్య కుదిర్చేందుకు మరో మార్గం గుండా ప్రయత్నిస్తున్నారు.