పార్టీ అధికారంలో ఉన్నపుడు అందరూ చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తినవారే. చినబాబు గురించి అయితే ఇక చెప్పేందుకు వారి మాటలు చాల్లేదు. ఒకానొక సందర్భంలో పోలవరం యాత్రకు వెళ్లిన తెలుగు మహిళలు భజన చేసి మరీ టికెట్ ఖర్చులకు రుణం చెల్లించు కున్నారు. ఇవన్నీ నిరుడు కురిసిన హిమవసంతాలు. మరిఇప్పుడో బాబు గారు మాజీ అయ్యారు. మున్ముందు సీఎం అవుతారనే గ్యారంటీ కూడా లేదు. పోనీ చినబాబు సంగతంటే.. ఆయన ఉంటే తెల్లచీర ఎందుకున్నట్టుగా మారిందంటూ తెలుగు తమ్ముళ్లే ఎద్దేవాచేస్తున్నారు. ఇంతగా పడిపోయిన చంద్రబాబు గ్రాఫ్ మళ్లీ లేస్తుందా అంటే.. సారీ.. అంటూ తమ్ముళ్ల సమాధానం. ఇటువంటి వేళలోనే వీరందరికీ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు, క్రిష్ణా, గోదావరి జిల్లాల్లోని కమ్మ, కమ్మేతర వర్గం ఇప్పుడు పక్కచూపుతు చూడటమే కాదు.. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కర్ఛీప్ పరిచేస్తున్నారు. మొన్న సుజన, నిన్న దేవేందర్ గౌడ్, ఇప్పుడు మువ్వా సత్యనారాయణ.. మరి రేపు.. కేశినేని, యరపతినేని, దేవినేని , కొమ్మాలపాటి, గరికపాటి, సాదినేని. ఇలా చంద్రబాబు కుడి భుజాలుగా కీర్తిగడించిన పెద్దలంతా పాపం గద్దెనెక్కలేని బాబుతో ఎందుకంటూ బీజేపీ, వైసీపీ వైపు చూస్తున్నారట. పనిలో పనిగా సీనియర్ల ను కలసి రేపోమాపో వస్తామంటూ మరీ గడువు కోరుతున్నారట. మరి అదే జరిగితే.. ఏపీలో తెలుగుదేశం పరిస్థితి తెలంగాణ మాదిరిగా మారినా ఆశ్చపోనక్కర్లేదట. ఇటువంటి సమయంలోనే బాబు మరింత వ్యూహాత్మ కంగా స్పందిస్తారు. అందుకే.. బావమరిది హరిక్రిష్ణ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చారు. జూనియర్ ఎన్ టీఆర్, కళ్యాణ్ రామ్ తో ఏకాంతంగా మాట్టాడారట. కోడలు నారా బ్రాహ్మణిని కూడా తెలంగాణ పార్టీలో కీలకంగా మార్చేందుకు అన్ని రకాలుగా అనుకూల వాతావరణం కూడా చూస్తున్నారట. ఎలాగూ ఐదేళ్లు సమయం ఉంది కాబట్టి.. నారా బ్రాహ్మణి, నందమూరి తారకరామారావు ఉరఫ్ జూనియర్ లను రంగంలోకి దింపి.. మేనేజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. టీడీపీ వైపు ఆ మాత్రం పాజిటివ్ సంకేతాలు ప్రజల నుంచి వస్తే.. చాలు ఎన్నికల ముందు లోకేష్ ను తెరమీదకు తీసుకు వచ్చి లాభపడాలనేది బాబు వ్యూహమట. ఇదే దారిలో పక్కపార్టీ గుట్టుమట్టు సేకరించేందుకు తన వర్గాన్ని కావాలనే బీజేపీ, వైసీపీలోకి కోవర్టులుగా పంపుతున్నారా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2009లో ప్రజారాజ్యం, 2019లో జనసేనలోకి తన గణాన్ని పంపి గుట్టు అంతా రాబట్టినట్టుగానే వైసీపీ, బీజేపీల లోగుట్టును తెలుసుకునేందుకు తన వారిని తానే పార్టీలు మార్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇదంతా నిజమేనా..