కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనను లైఫ్ సపోర్ట్పై ఉంచినట్లు దిల్లీ ఎయిమ్స్ వైద్యులు శనివారం తెలిపారు. ఆయనకు ఈసీఎంఓ(ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రాన్ ఆక్సిజనేషన్)ను అమర్చినట్లు తెలిపారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వీటిని అమర్చారు. కిడ్నీలు, గుండె పనితీరు మందగించినప్పుడు ఈసీఎంఓను ఉపయోగిస్తారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఎయిమ్స్కు చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.
జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం ఆసుపత్రిని సందర్శించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, సహాయమంత్రి అశ్విని చౌబేలు రాష్ట్రపతి వెంట ఉన్నారు. ఈనెల 9న అస్వస్థతకు గురికావడంతో జైట్లీని ఎయిమ్స్కు తరలించారు. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు తెలియజేస్తున్నారు.