ఆంధ్రప్రదేశ్ శాసనసభతో ఆ రాష్ట్రంలోని లోక్సభ స్థానాలకు నిన్న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ పోలింగ్ ఆలస్యమైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిలబడ్డ వారికి ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. దీంతో గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూల్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. నిన్న 76.69 శాతం పోలింగ్ నమోదు కాగా, 2014 సాధారణ ఎన్నికల్లో 78 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ 102, వైఎస్సార్సీపీ 67, బీజేపీ 4 స్థానాల్లో గెలిచాయి. ఇద్దరు స్వతంత్రులు కూడా గెలుపొందారు. 25 లోక్సభ స్థానాల్లో టీడీపీ 15, వైఎస్సార్సీపీ 8, బీజేపీ రెండు స్థానాల్లో గెలిచాయి.