ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులు ఐటీఆర్ ఫైలింగ్‌ ఎప్పుడు చేయాలి? పన్ను నిపుణుల సలహా ఇదే

business |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 10:25 PM

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన క్రమంలో ఐటీ రిటర్నుల దాఖలు సీజన్ మొదలైంది. ఇప్పటికే ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు చేసేందుకు ఐటీఆర్ ఫామ్స్ అందుబాటులోకి తెచ్చింది ఐటీ శాఖ. ఏప్రిల్ 1 నుంచే రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో పాటు ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరం (2024-25 అసెస్మెంట్ ఇయర్) ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ సంబంధించిన వివరాలను ఫోన్ నంబర్లకు మెసేజ్ పంపిస్తోంది. దీంతో చాలా మంది ఉద్యోగులు ఇప్పుడే పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, అది సరైన నిర్ణయం కాదంటున్నారు పన్ను నిపుణులు. తొందరపడకుండా సరైన సమయం కోసం వేచి చూడాలని చెబుతున్నారు.


ఆదాయం, టీడీఎస్ మినహాయింపుల్లాంటి పూర్తి వివరాలు లేకుండా రిటర్నులు దాఖలు చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం నిబంధనల మేరకు ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యాలు జూన్ 15వ తేదీ లోపు ఫారం 16 అందించాలి. అలాగే ఆ సమయంలోగా ఫామ్ 26 ASతో పాటు వార్షిక సమాచార నివేదిక సైతం అప్డేట్ అవుతాయి. ఇవన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత పన్ను రిటర్నులు దాఖలు చేయడం మంచిదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.


ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఐటీఆర్- 1 ఫామ్ అందుబాటులో ఉంది. కానీ, గత ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకే అందులో ఆదాయం, టీడీఎస్ వివరాలు కనిపిస్తున్నాయి. జనవరి- మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఆదాయం, టీడీఎస్ వివరాలు ఇంకా అప్డేట్ కాలేదని తెలుస్తోంది. దీంతో ఉద్యోగులు యాజమాన్యానికి సమర్పించిన హోమ్ లోన్ వడ్డీ, ఇతర మినహాయింపులనూ క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి మొత్తం ఆదాయం, పన్ను కోత, మినహాయింపుల వివరాలు లేకుండా రిటర్నులు దాఖలు చేయడం సరైన నిర్ణయం కాదనేది పన్ను నిపుణుల మాట. అన్ని వివరాలు వచ్చే వరకూ ఆగి, ఆ తర్వాతే ఎలాంటి తప్పులు లేకుండా రిటర్నులు దాఖలు చేయడం మంచిదంటున్నారు. అయితే, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు జులై 31 వ తేదీ వరకే గడువు ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత సైతం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. ఆగస్టు 1వ తేదీన రిటర్న్స్ ఫైల్ చేసినా మూడు నెలలకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అందుకే గడువులోపు రిటర్న్స్ దాఖలు చేయాలని నిపుణులు సూచిస్తుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com