ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీ దిగ్గజం విప్రోకు షాక్.. టీసీఎస్, ఇన్ఫీకి భిన్నంగా ఫలితాలు.. కష్టమే అంటున్న కొత్త సీఈఓ!

business |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 10:12 PM

దేశంలోని నాల్గవ అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో.. క్యూ4 (జనవరి- మార్చి) ఫలితాల్ని ప్రకటించింది. నికర లాభం 8 శాతం పడిపోయి రూ. 2835 కోట్లుగా నమోదైంది. నికర లాభం తగ్గినప్పటికీ .. అంచనాల్ని మాత్రం అధిగమించింది. ఏడాది కిందట ఇదే త్రైమాసికంలో 3 నెలల కాలంలో విప్రో నికర లాభం రూ. 3074.5 కోట్లుగా నమోదైంది. ఇక ఈ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఆదాయం 4 శాతం పతనంతో రూ. 22,208 కోట్లుగా నమోదైంది. ఇక్కడ కూడా అంతకుముందు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆదాయం రూ. 23,190 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు తగ్గింది. నికర లాభంలో మాత్రం అంచనాల్ని మించి రాణించగా.. ఆదాయంలో మాత్రం అంచనాల్ని తప్పింది. విప్రో సీఈఓగా థియరీ డెలాపోర్టే ఇటీవల రాజీనామా చేయగా.. ఈ నెలలోనే కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టారు శ్రీని పల్లియా. దీంతో వచ్చీరాగానే ఆయనకు ఈ ఫలితాలు అంత రుచించకపోవచ్చు.


సమీక్షా త్రైమాసికంలో విప్రోకు ఐటీ సర్వీసెస్ సెగ్మెంట్ నుంచి వచ్చిన ఆదాయం 2657.4 మిలియన్ డాలర్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇది 6.4 శాతం తగ్గింది. ఇక కరెన్సీ ఐటీ సర్వీసెస్ రెవెన్యూ 0.3 శాతం తగ్గింది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన కాగా.. వార్షిక ప్రాతిపదికన 6.6 శాతం పడిపోయింది. ఇక విప్రో మొత్తం 3.6 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ దక్కించుకోగా.. లార్జ్ డీల్స్ 1.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది త్రైమాసిక ప్రాతిపదికన 31 శాతం పెరగ్గా.. వార్షిక ప్రాతిపదికన 9.5 శాతం అధికం. క్యూ4లో విప్రో ఆపరేటింగ్ మార్జిన్స్ 16.4 శాతంగా ఉంది.


విప్రో ఫలితాలపై సంస్థ సీఈఓ అండ్ ఎండీ శ్రీని పల్లియా స్పందించారు. ఐటీ ఇండస్ట్రీకి 2023-24 ఆర్థిక సంవత్సరం సవాళ్లు సృష్టించిందని నిరూపితమైందని.. ఇప్పటికీ స్థూల ఆర్థిక వాతావరణం అనిశ్చితిలోనే కొనసాగుతుందని అన్నారు. అయితే అవకాశాలు దక్కుతాయని ఆశాజనకంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌తో అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.


జూన్ త్రైమాసికానికి సంబంధించి అంచనాల్ని కూడా వెలువరించింది విప్రో. ఐటీ సర్వీసెస్ రెవెన్యూ 2617 మిలియన్ డాలర్ల నుంచి 2670 మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ఇతర ఐటీ సంస్థలతో పోలిస్తే విప్రోలో అట్రిషన్ రేటు పెరిగింది. అంటే కంపెనీని వీడే ఉద్యోగుల సంఖ్య డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే పెరిగిందన్న మాట. క్యూ3లో ఇది 12.3 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది 14.2 శాతానికి చేరిందని ఫలితాల సందర్భంగా వెల్లడించింది. ఇక విప్రో షేరు ధర ఫలితాలకు ముందు 1.74 శాతం పెరిగి రూ. 452.10 వద్ద స్థిరపడింది.


అంతకుముందు గత వారం ఏప్రిల్ 12న టీసీఎస్ ఫలితాల్ని ప్రకటించింది. నికర లాభం 9 శాతం పెరిగింది. అంచనాల్ని మించి రాణించింది. డివిడెండ్ రూ. 28 గా ప్రకటించింది. ఇంకా ఇన్ఫోసిస్ కూడా అంచనాల్ని మించి ఫలితాల్ని నమోదు చేసింది. మరోవైపు విప్రో మాత్రం అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి బలహీన ఫలితాల్ని నమోదు చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com