ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీహార్ జైలులో కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు కుట్ర.. ఆప్ సంచలన ఆరోపణలు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 10:05 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ గురించి.. ఈడీ అధికారులు కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. షుగర్ లెవల్స్ పెంచుకుని తద్వారా బెయిల్ పొంది జైలు నుంచి బయటికి వచ్చేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈడీ ఆరోపణలపై తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్పందించారు. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర చేస్తున్నట్లు ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషీ మార్లేనా తాజాగా పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌ కోసం అరవింద్ కేజ్రీవాల్‌ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించడంపై ఆప్‌ స్పందించింది. ఆరోగ్య కారణాలు చూపి బెయిల్‌ పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఈడీ చెప్పడంపై తీవ్రంగా మండిపడింది. కేజ్రీవాల్‌ను చంపేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని అతిషి మార్లేనా తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తమకు అనుకూలంగా ఉన్న ఈడీ ద్వారా కేజ్రీవాల్‌ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు ఇంటి నుంచి భోజనాన్ని అందించకుండా చేసేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ అధికారులు కోర్టులో చెప్పిందంతా అబద్ధమని స్పష్టం చేశారు.


బాడీలో షుగర్ లెవల్స్ పడిపోవడం చాలా ప్రమాదకరమని అతిషి పేర్కొన్నారు. అందుకే డయాబెటిస్ ఉన్న వ్యక్తులు అరటిపండు లేదా చాక్లెట్‌ వంటి ఏదైనా తియ్యని పదార్థాలు వెంట ఉంచుకోవాలని డాక్టర్లు చెబుతారని తెలిపారు. కేజ్రీవాల్‌ ఆలూ-పూరీ తింటున్నారని ఈడీ అధికారులు చెబుతున్నారని.. కానీ కేజ్రీవాల్ కేవలం నవరాత్రుల ప్రారంభ రోజున మాత్రమే పూరీ తిన్నారని తేల్చి చెప్పారు. కేజ్రీవాల్‌కు ఇంటి భోజనం అందకుండా చేసి ఆయనను చంపేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే ఈడీ ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కేజ్రీవాల్‌కు ఇంటి భోజనం అందించకపోతే తీహార్ జైలులో ఆయనకు ఎలాంటి ఆహారాన్ని అందిస్తారో తెలియదని అతిషి ఆందోళన వ్యక్తం చేశారు.


గత కొన్నిరోజులుగా కేజ్రీవాల్‌ బాడీలో షుగర్ లెవల్స్ 300 mg/dl కంటే ఎక్కువగా ఉన్నాయని అతిషి పేర్కొన్నారు. కానీ జైలు అధికారులు ఆయన ఇన్సూలిన్‌ తీసుకునేందుకు నిరాకరించారని ఆమె ఆరోపించారు. తన శరీరంలో షుగర్ లెవల్స్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన సొంత డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించేందుకు అనుమతివ్వాలని కోరుతూ కేజ్రీవాల్‌ తాజాగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈడీ ఆరోపణలు చేయగా.. వాటిపై అతిషి ఈ వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com