ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సివిల్స్‌‌లో సత్తాచాటిన స్వీపర్ కుమారుడు.. హ్యట్సాఫ్

national |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 09:55 PM

మూడు రోజుల కిందట విడుదలైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ ఫలితాల్లో విజేతలుగా నిలిచిన అభ్యర్థుల ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. కుటుంబానికి తెలియకుండా చదివింది ఒకరైతే.. కార్పొరేట్ కొలువులను వదిలిసిందే ఇంకొకరు. ఇక, నిరుపేద కుటుంబానికి చెందిన పులువురు స్తతాచాటి.. ఎందరికో ప్రేరణగా నిలిచారు. ఓ పారిశుద్ధ్య కార్మికురాలి తనయుడు కూడా సివిల్స్‌లో ర్యాంకు సాధించాడు. ఆయన ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది సార్లు విఫలమైనా.. నిరుత్సాహానికి గురికాలేదు. ఒక్కో వైఫల్యంలో తన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటూ.. చివరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు మహారాష్ట్రలోని థానేకు చెందిన 32 ఏళ్ల ప్రశాంత్ సురేశ్ భోజనే. సివిల్స్‌‌లో 849 ర్యాంకు సాధించారు.


ప్రశాంత్‌ సురేశ్ తల్లి ఠాణె మున్సిపల్‌ కార్పొరేషన్‌లో స్వీపర్‌ కాగా... తండ్రి కూడా అందులోనే గ్రూప్-4 ఉద్యోగి. బీటెక్ పూర్తయిన తర్వాత ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో 2015 నుంచి ప్రయత్నిస్తున్నారు. ఎనిమిది సార్లు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. పట్టువిడవకుండా తొమ్మిదో ప్రయత్నంలో విజయం అందుకున్నారు. దీంతో థానేలోని ప్రశాంత్ కుటుంబం నివాసం ఉండే ఖర్తన్‌ రోడ్‌ స్వీపర్‌ కాలనీవాసుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వారంతా ర్యాలీ నిర్వహించి, యువకుడ్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.


సివిల్స్‌లో ర్యాంకు సాధించడంపై ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే 2020 నుంచి ఢిల్లీలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో మాక్‌ టెస్ట్ పేపర్ల కరెక్షన్ చేసేవాడిని.. దీంతో అటు ప్రిపరేషన్, ఇటు ఉపాధి లభించింది.. తొమ్మిదేళ్లుగా నేను సక్సెస్ కాకపోవడంతో ఆపేసి ఇంటికి వచ్చేయమని అమ్మానాన్నలు చెప్పేవారు. నా విషయంలో ఎన్నో బాధలు పడ్డారు.. ఇప్పుడు వారి సహనంతో పాటు నా శ్రమకు ప్రతిఫలం దక్కింది’ అని ప్రశాంత్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ‘నా కొడుకును ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనేది కోరిక... కానీ, అతడు చేసింది సరైందేనని ఇప్పుడు అనిపిస్తోంది’ అని ప్రశాంత్ తండ్రి సురేశ్ భోజనే తెలిపారు. ‘పారిశుద్ధ్య కార్మికుల పిల్లలే కదా అని చిన్నచూపూ చూడొద్దు.. వారికీ ప్రతిభ ఉంటుంది. ప్రశాంత్‌ సురేశ్ ఇదే విషయాన్ని నిరూపించాడు.. ఇది మాకెంతో గర్వకారణం. కాలనీలోని ఇతరులకు ఆయన ఆదర్శంగా నిలిచారు’ అని స్థానిక మున్సిపల్ కార్మికుల సంఘం నేత జగదీశ్ కైరాలియా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com