ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల జీతం ఎంత.. ఇతర అలవెన్సులు కలిపి ఎంత వస్తుంది

national |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 09:13 PM

ప్రస్తుతం దేశంలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. లోక్‌‌సభ ఎంపీగా గెలవాలని.. పార్లమెంటులో అడుగు పెట్టాలని ఎన్నో వేల మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని ఈ లోక్‌సభ ఎన్నికల్లో పరీక్షించుకుంటున్నారు. మన దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ప్రస్తుతం 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే అసలు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీగా ఎన్నికైన వారికి ఎంత జీతం వస్తుంది అనే అంశం ప్రస్తుతం ఆసక్తి కలుగుతోంది. జాతీయ, ప్రాంతీయ పార్టీలే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.


ప్రతీ ఎంపీ నెలకు రూ.1 లక్ష జీతాన్ని పొందుతారు. అంతేకాకుండా రోజుకు రూ.2 వేల చొప్పున అలవెన్సులు అందుతాయి. ఇవే కాకుండా నియోజకవర్గ అలవెన్సు కింద నెలకు రూ.70 వేలు, ఆఫీస్ ఖర్చుల కింద నెలకు మరో రూ.60 వేలు కూడా ప్రతీ ఎంపీకి చెల్లిస్తారని పీఆర్ఎస్ ఇండియా సమాచారం ద్వారా తెలుస్తోంది. దీంతో ప్రతీ ఎంపీకి నెలకు రూ.2.30 లక్షలతోపాటు రోజుకు రూ.2 వేల అలవెన్సు లభిస్తుంది.


ఇక ప్రధానమంత్రికి, కేబినెట్ మంత్రులకు మరికొంత ఎక్కువ అలవెన్సులు ఉంటాయి. ప్రధానికి నెలకు రూ.3 వేలు.. కేబినెట్ మంత్రులకు నెలకు రూ. 2 వేలు.. సహాయ మంత్రులకు నెలకు రూ. వెయ్యి అదనపు అలవెన్సులు లభిస్తాయి. ఇక ఎంపీల జీతభత్యాలను 2023 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి ప్రతీ ఐదేళ్లకు ఒకసారి పెంపు ఉంటుంది. అయితే కరోనా సమయంలో ఏడాది పాటు ఎంపీల జీతాల్లో కోత విధించారు. ప్రతీ ఎంపీ జీతం నుంచి 30 శాతం జీతాన్ని తగ్గించారు. 2020 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 2021 ఏప్రిల్ 1 వ తేదీ వరకు అందరు ఎంపీల జీతం 30 శాతం కట్ అయింది.


ఇక దేశంలో ఏ మూలన ఉన్న ఎంపీ అయినా పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఎంపీ విధులకు సంబంధించి ప్రయాణించేందుకు ట్రావెలింగ్ అలవెన్సులు కూడా ఉంటాయి. ప్రతీ ఎంపీకి ఏ రైలులోనైనా ఫస్ట్ క్లాస్ ఏసీ రైలు టికెట్ ఒకటి ఫ్రీగా ఇస్తారు. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ఎప్పుడైనా, ఏ రైలులోనైనా ప్రయాణించేందుకు వీలు ఉంటుంది. లడఖ్, అండమాన్ నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల ఎంపీలకు స్పెషల్ అలవెన్సులు కూడా ఉంటాయి. అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించే ఎంపీలకు వారు ఉంటున్న ప్రాంతం నుంచి దగ్గర్లోని ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు స్టీమర్‌లో ప్రయాణించేందుకు ఒక టికెట్ లేదా అందుకు సమానమైన నగదును అందిస్తారు. ఇక లడఖ్‌ నుంచి ఎంపీగా ఎన్నికైన వారు, వారి జీవిత భాగస్వామికి లడఖ్ నుంచి ఢిల్లీకి ప్రయాణించేందుకు విమానంలో ప్రయాణించేందుకు టికెట్ డబ్బులను చెల్లించనున్నారు.


ప్రతీ ఎంపీకి పదవీ కాలం అయిపోయిన తర్వాత నెలకు రూ. 25 వేల పెన్షన్ అందుతుంది. ఇక ఐదేళ్ల కంటే ఎక్కువకాలం ఎంపీగా పనిచేసిన వారికి నెలకు రూ.2 వేలు అదనంగా పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్లు కూడా 2023 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి ప్రతీ ఐదేళ్ల కోసారి పెంపు ఉంటుంది. ఇక అమెరికాలో ఒక్కో ఎంపీకి ఏడాదికి రూ.1.44 కోట్లు అంటే నెలకు రూ.12 కోట్ల జీతం అందుతుంది. మరోవైపు.. బ్రిటన్ ఎంపీలకు ఏడాదికి రూ.95 లక్షలు అంటే నెలకు రూ.7.91 లక్షల జీతం దక్కుతుంది. వీటితోపాటు ఆఫీస్ ఖర్చులు, సిబ్బంది, నియామకం, వారు ఉంటున్న ప్రాంతం నుంచి పార్లమెంటుకు వచ్చేందుకు ట్రావెలింగ్ అలవెన్సులు అందిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com