ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ 6 జిల్లాల్లో ఒక్క ఓటు పడలేదు.. ఓటు వేయని 20 మంది ఎమ్మెల్యేలు, 4 లక్షల మంది ఓటర్లు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 09:10 PM

ఎన్నికలు వచ్చాయంటే చాలు పోలింగ్ తేదీ రోజున ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు పోటెత్తుతారు. గంటల తరబడి లైన్లలో నిలబడి అయినా.. తాము మద్దతు ఇచ్చే నేతలకు, పార్టీలకు ఓట్లు వేస్తారు. అయితే అక్కడ మాత్రం 6 జిల్లాల్లో ఒక్కరు కూడా ఓటు వేయలేదు. దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అందులో 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండటం గమనార్హం. అవే నాగాలాండ్ రాష్ట్రంలోని 6 జిల్లాలు. ఓట్లు వేయడానికి ఒక్కరు కూడా రాకపోవడంతో.. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది.. రోజంతా ఖాళీగా కూర్చొని.. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత.. పోలింగ్ సామాగ్రి తీసుకుని వెళ్లిపోయారు.


నాగాలాండ్‌లోని ఈ 6 జిల్లాల పరిధిలో నాగా తెగకు చెందిన ప్రజలు జీవిస్తున్నారు. అయితే వారు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఎన్నో ఏళ్లుగా తమ డిమాండ్‌ను ప్రభుత్వాల ముందు ఉంచారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో ఉన్న 7 గిరిజన తెగలు కలిసి ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్-ఈఎన్‌పీఓగా ఏర్పడి.. ప్రత్యేక రాష్ట్రం కోసం 2010 నుంచి పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం నుంచి ఆ ఆరు జిల్లాల పరిధిలో ఈఎన్‌పీఓ బంద్ నిర్వహిస్తోంది. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఆ 6 జిల్లాల ప్రజలు నిర్ణయం తీసుకోవడంతో ఓటింగ్ శాతం నమోదు కాలేదు.


నాగాలాండ్‌లో మొత్తం 13.25 లక్షల ఓటర్లు ఉండగా.. ఈ ఆరు జిల్లాల పరిధిలోనే 4,00,632 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 6 జిల్లాల పరిధిలో 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 6 జిల్లాల్లో మొత్తం 738 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక్కరు కూడా ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. 20 మంది ఎమ్మెల్యేలు కూడా బయటికి రాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఓటర్లు వస్తారని 9 గంటలపాటు ఎదురుచూసిన ఎన్నికల అధికారులు.. చివరికి ఖాళీ ఈవీఎంలతో తిరుగుపయనమయ్యారు.


ఈఎన్‌పీఓ బంద్ పిలుపునివ్వడంతో ఆరు జిల్లాల్లోని లక్షల మంది ఓటర్లు ఇళ్లలోనే ఉన్నారు. అధికారులు, అత్యవసర సేవలు తప్ప ఎవరూ రోడ్లపై కనిపించలేదు. ఈ ఘటనపై నాగాలాండ్‌ సీఎం నెయిఫియు రియో స్పందించారు. ఫ్రంటియర్‌ నాగాలాండ్‌ టెరిటరీకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఇప్పటికే సిఫార్సు చేసినట్లు తెలిపారు. అయితే 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంటారా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించగా.. తాము ఎలాంటి ఘర్షణ కోరుకోవడం లేదని సీఎం నెయిఫియు రియో స్పష్టం చేశారు.


ఇక ఎన్నికల వేళ బంద్‌కు పిలుపునివ్వడాన్ని నాగాలాండ్‌ ఎన్నికల అధికారులు సీరియస్‌గా స్పందించారు. ఈఎన్‌పీవోకు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు నాగాలాండ్ రాష్ట్ర ఎన్నికల అధికారి వయసన్‌ ఆర్‌ పేర్కొన్నారు. ఆ నోటిసులపై స్పందించిన ఈఎన్‌పీవో అధ్యక్షుడు సపికియు సంగ్తం.. సీఈఓ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్న సెక్షన్‌ ఎన్నికల వేళ వర్తించదని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com