ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.. తొలిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.. నామినేషన్ పత్రాలతో పాటుగా ఆస్తులు వివరాలను కూడా వెల్లడించారు. తొలి రోజు నామినేషన్లు సమర్పించిన వారిలో పలువురు అభ్యర్థుల ఆస్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెలుగు దేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు.
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, ప్రభాకర్రెడ్డి పేరిట రూ.639.26 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో ప్రస్తావించారు. అప్పులు రూ.197.29 కోట్లు ఉండగా.. ఆమెపై ఎలాంటి కేసులు లేవు. అలాగే వివిధ బ్యాంకు అకౌంట్లలో రూ.1.17 కోట్లు ఉండగా, షేర్లు, బాండ్ల రూపంలో రూ.10.62 కోట్లు ఉన్నాయి. వీరికి రూ.6.96 కోట్ల విలువైన రూ.19 కార్లున్నాయని తెలిపారు.
మరోవైపు కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన కుటుంబ స్థిర, చరాస్తులు రూ.20.57 కోట్లుగా అఫిడ్విట్లో పేర్కొన్నారు. రూ.3.45 కోట్ల అప్పు ఉందని.. ఆస్తుల్లో ప్రసన్నకుమార్రెడ్డి పేరిట రూ.10.65 కోట్లు, అతని భార్య పేరుపై 3.04 కోట్లు, కుమారుడి పేరుతో రూ.4.75 కోట్లు, కోడలు పేరున రూ.2.11 కోట్ల చొప్పున ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై ఎలాంటి కేసుల్లేవని తెలిపారు.