ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలనొప్పితో చనిపోయిన డాక్టర్.. మైగ్రేన్ అంత డేంజరా

national |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 07:53 PM

ఇటీవలి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో మైగ్రేన్‌ చాలా తీవ్రమైనది. ఇది ఒకరకమైన తలనొప్పే అయినప్పటికీ.. సాధారణంగా తలకు ఒక వైపున మాత్రమే వస్తూ ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో తలకు రెండు వైపులా నొప్పి వస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ 24 ఏళ్ల లేడీ డాక్టర్.. తీవ్రమైన తలనొప్పి కారణంగా నిద్రలోనే చనిపోయిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఆమెకు మైగ్రేన్ తప్ప ఇతర అనారోగ్య సమస్యలేవీ లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె తరచూ మైగ్రేన్‌తో బాధపడుతూ ఉండేదని పేర్కొన్నారు. దీంతో మైగ్రేన్ ప్రాణాలు తీస్తుందా అనే ప్రశ్న ప్రస్తుతం ఈ విషయం విన్న ప్రతీ ఒక్కరిలో తలెత్తుతోంది.


కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 24 ఏళ్ల డెంటిస్ట్ స్వాతి శెట్టి తీవ్రమైన తలనొప్పితో మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను పరిశీలించిన డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం.. స్వాతి శెట్టి తన తల్లితో రాత్రి ఫోన్‌ మాట్లాడిందని.. తనకు బాగా తలనొప్పిగా ఉందని.. తర్వాతి రోజు మాట్లాడుతానని ఫోన్ పెట్టేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రాత్రి ఆమె నిద్రపోయింది. తర్వాతి రోజు తెల్లవారుజామున స్వాతి శెట్టిని లేపడానికి ఆమె రూమ్‌మేట్ ప్రయత్నించింది.


ఎంత లేపినా లేవకపోవడంతో స్వాతి శెట్టిని పట్టుకుని చూడగా.. ఆమె శరీరం మొత్తం చల్లగా మారింది. వెంటనే ఆ రూమ్‌మేట్ స్వాతి శెట్టిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న స్వాతి శెట్టి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. స్వాతి శెట్టికి కేవలం మైగ్రేన్ సమస్య మాత్రమే ఉందని.. అంతకుమించి ఎలాంటి అనారోగ్యం లేదని స్పష్టం చేశారు.


మైగ్రేన్ మనుషులను చంపేస్తుందా?


ఈ ఘటనతో మైగ్రేన్ కారణంగా ప్రాణాలు పోతాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మైగ్రేన్ కారణంగా గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని.. వాటి కారణంగా హార్ట్ ఎటాక్స్ వస్తాయని పేర్కొంది. అయితే వాపు, రక్తం గడ్డకట్టడం, ధమనుల లైనింగ్‌తోపాటు ఇతర అనేక సమస్యల వల్ల ఈ మైగ్రేన్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.


ఇక మైగ్రేన్‌కు హార్ట్ స్ట్రోక్‌కు సంబంధం ఉందని తేల్చారు. . మైగ్రేన్‌ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. మైగ్రేన్, ఇస్కీమిక్ స్ట్రోక్ మధ్య ఉన్న సంబంధానికి సంబంధించి ఎన్నో అధ్యయనాల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఎందుకంటే మైగ్రేన్, ఇస్కీమిక్ స్ట్రోక్ రెండూ రక్తనాళాల సరఫరాకు సంబంధించిన సమస్యలే కావడం గమనార్హం. మైగ్రేన్ మయోకార్డియల్ ఇన్‌ఫ్రక్షన్‌, స్ట్రోక్ కార్డియోవాస్కులర్ డెత్ ప్రమాదాన్ని సైతం పెంచుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మెడికల్ టెస్ట్‌లు చేయకుండా కొంతమంది రోగులలో స్ట్రోక్, మైగ్రేన్ మధ్య తేడాను గుర్తించడం కష్టమని డాక్టర్లు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com