ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 07:46 PM

విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే కేఏ పాల్‌ పేరిట ఆస్తులు చాలా తక్కువ ఉన్నాయి. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. మొత్తంగా రూ.1.86 లక్షల సొమ్ము ఉంది. వాహనాలు, స్థిరాస్తులు, రుణాలు లేవు. డిగ్రీ రెండో ఏడాదిలోనే చదువు ఆపేశారు.. అలాగే కేఏ పాల్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, మహబూబ్‌నగర్‌, ఎల్‌.కోట, రాజన్న సిరిసిల్ల, నల్గొండ ప్రాంతాల్లో ఆరు కేసులున్నాయి.


ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్‌ స్టేషన్‌ (క్రైమ్‌ నంబరు 229/2012), విజయనగరం జిల్లా ఎల్‌.కోట (ఎఫ్‌ఐఆర్‌ నంబరు 59/2024), తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డకల్‌ (ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 10/2010), రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి (ఎఫ్‌ఐఆర్‌ నంబరు 99/2022), నల్లగొండ జిల్లా మునుగోడు (ఎఫ్‌ఐఆర్‌ నంబరు 122(2022), సిద్ధిపేట స్టేషన్‌ (ఎఫ్‌ఐఆర్‌ నంబరు 166/2022)లలో ఒక్కొక్క కేసు ఉంది. ఇదిలావుండగా తన వద్ద రూ.49 వేలు, హెడ్‌సీఎఫ్‌సి బ్యాంకు అక్కయ్యపాలెం బ్రాంచి, ఫెడరల్‌ బ్యాంకు విశాఖ, సికింద్రాబాద్‌ బ్రాంచీల్లో గల ఖాతాల్లో రూ.1,37,071...మొత్తం రూ.1,86,071 నగదు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు స్థిరాస్తులు, వాహనాలు లేవని పేర్కొన్నారు. కాగా 1981లో ఇంటర్‌ పాసైన పాల్‌...అనకాపల్లి ఏఎంఎఎల్‌ కళాశాలలో డిగ్రీలో చేరి చదువుకు స్వస్తి పలికారు.


మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తొలి రోజు నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కేవలం నాలుగు నియోజకవర్గ పరిధిలో ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. విశాఖ తూర్పు, దక్షిణం, పశ్చిమ నియోజకవర్గాలకు తొలిరోజు ఒక్క నామపత్రం కూడా రాలేదు. ఇటు ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్‌కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.


సుందరపు విజయ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిపి రూ. 8.32 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. నామినేషన్‌ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్‌లో తన పేరిట రూ. 1.89 కోట్లు అప్పులున్నాయని పేర్కొన్నారు. చరాస్తి రూ.3.98 కోట్లు, స్థిరాస్తి రూ. 2.40 కోట్లు ఉందని తెలిపారు. తన పేరున కార్లు లేవని, బొలెరో ట్రక్‌ ఉందని, దీని విలువ రూ. 2.61 లక్షలుగా చూపించారు. విజయ్‌కుమార్‌ పేరున మూడు బ్యాంకుల్లో రూ. 1.89 కోట్ల గృహ రుణాలు ఉన్నాయన్నారు.


విశాఖ జిల్లా మధురవాడలో రుషికొండ వద్ద రెండు ఇళ్లు, అచ్యుతాపురం మండలం చోడిపల్లిలో ఒక ఇల్లు ఉన్నట్లు... వీటి విలువ రూ.2.4 కోట్లు ఉందని వివరించారు. భార్య శైలజ పేరున రూ. 53 లక్షల చరాస్తి, కుమార్తె సుకీర్తి పేరున రూ. 22 లక్షలు, రెండో కుమార్తె నేహా శ్రీలక్ష్మి పేరున రూ.18 లక్షల ఆస్తులున్నాయని వెల్లడించారు. తనపేరుతో బ్యాంకు డిపాజిట్లు రూ. 3.06 లక్షలు, భార్య పేరున రూ. 12.85 లక్షలు, కుమార్తెల పేరున రూ. 1.58 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. తన దగ్గర ప్రస్తుతం డబ్బులు రూ. 4.53 లక్షలు, భార్య వద్ద రూ. 2.37 లక్షలు ఉందని లెక్కలు చూపారు. రూ.6.85 లక్షల విలువైన 101 గ్రాముల బంగారం, భార్య పేరున రూ. 38 లక్షల విలువైన 567 గ్రాముల బంగారం, పెద్ద కుమార్తె వద్ద రూ.15.75 లక్షల విలువైన 232 గ్రాముల బంగారం, చిన్న కుమార్తె పేరున రూ. 14 లక్షల విలువైన 209 గ్రాముల బంగారం ఉందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com