ప్రజాస్వామ్యంలో రాజకీయ హత్యలకు స్థానం ఉండకూడదని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బుధవారం కేరళలోని కన్నూర్లో భాజపా చేపట్టిన జనరక్ష పాదయాత్రలో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ నేతలపై జరుగుతున్న దాడులు, హత్యలను తీవ్రంగా ఖండించారు. ‘ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు.. కానీ ఇక్కడ హత్యలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. సీపీఐ(ఎం) అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న విషయాన్ని ప్రజలకు తెలియజేప్పేందుకే ఈ యాత్ర చేపట్టాం. రాజకీయ హత్యలను ఆపాలి.’ అని సీఎం యోగి అన్నారు.
ఈ యాత్రకు ప్రజల నుంచి భారీగా మద్దతు లభించిందని ఆయన వెల్లడించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం కన్నూర్ నుంచి జనరక్ష యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 17 వరకు ఈ యాత్ర నిర్వహించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులు ఈ యాత్రలో పాల్గొననున్నారు.