నంద్యాల ఉప ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో నగదు ఏరులై పారుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నంద్యాలలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న 22 మందిని కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్, ఐలూరు ప్రాంతాల్లో నగదు పంపిణీ చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా 22 మంది దొరికారు. వారి నుంచి భారీస్థాయిలో నగదును స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
పోలీసులకు పట్టుబడిన వారిలో 9మంది కడప, ఆరుగురు పులివెందుల, మిగిలిన వారు నెల్లూరు ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరు ఏ పార్టీకి చెందినవారన్న దాని ఆరా తీస్తున్నారు. నగదు పంపిణీ విషయంలో నేతల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే ఈ విషయం బయటకు పొక్కినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ ప్రాంతంలో ఓటుకు రూ.2వేలు ఇస్తుండగా.. మరొకచోట తక్కువ ఇస్తున్నారని స్థానికులు వారితో గొడవ పెట్టుకున్నారని.. అందుకే ఎవరో ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేసి ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి.