విజయవాడ: గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నైకు మరో సర్వీసు అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం విమానాశ్రయం నుంచి నిత్యం రెండు సర్వీసులు నడుస్తున్నాయి. వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోంది. టిక్కెట్లు సైతం దొరకని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నైకు నూతన సర్వీసును నడిపేందుకు ఎయిరిండియా ముందుకొచ్చింది. ఆగస్టు 30 నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం చెన్నైకు నడుస్తున్న స్పైస్జెట్, ట్రూజెట్ సర్వీసులు రెండూ సాయంత్రం ఒకటి, రాత్రి 10 గంటలకు మరొకటి ఉన్నాయి. పగటి వేళ చెన్నైకు వెళ్లాలనుకునే వారికి విమాన సౌకర్యం లేదు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం సమయంలో ఎయిరిండియా నూతన సర్వీసును చెన్నైకు నడపాలని భావిస్తున్నారు. గన్నవరం-చెన్నై ఎయిరిండియా సర్వీసుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో రానుందని విమానాశ్రయం డైరెక్టర్ జి.మధుసూదన్రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం చెన్నైకు నడుస్తున్న రెండు సర్వీసుల్లోనూ టిక్కెట్ల ధరలు భారీగా ఉంటున్నాయి. ఒక్కోసారి రూ.11వేల వరకూ ధర ఉంటోంది. ఎయిరిండియా సర్వీసు వచ్చాక.. పోటీ పెరిగి టిక్కెట్ ధరలు రూ.3వేల వరకూ దిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.