గుంటూరు: పెదకాకాని జీపీఆర్ గార్డెన్స్ రోడ్డు ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతిచెందారు. సీఐ బండారు సురేష్ బాబు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన బండారు గోపీనాథ్ సాఫ్టవేర్ ఉద్యోగం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఈయనకు గుంటూరు శివనాగరాజుకాలనీకి చెందిన దివ్యశ్రీతో వివాహమైంది. వీరికి రెండు నెలల బాబు ఉన్నాడు. కరోనా కారణంగా గోపీనాథ్ కొన్ని నెలల నుంచి అత్తవారింటిలోనే ఉంటూ 'వర్క్ ఫ్రం హోమ్' చేస్తున్నారు.
గుంటూరు ఆర్టీసీ కాలనీలో ఈయన సోదరుడు శశికుమార్ ఓ మిఠాయి దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆ షాపులోని ఆవిరి బయటకు వెళ్లడానికి 'ఎగ్జాస్టింగ్' పంకా తీసుకొచ్చే నిమిత్తం గోపీనాథ్ శుక్రవారం ద్విచక్రవాహనంపై మంగళగిరి వెళ్లారు. గోపీనాథ్ ఇంటికి తిరిగొస్తుండగా పెదకాకాని శివారులోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. స్థానికులు వెంటనే ఆయన్ను అంబులెన్స్ ద్వారా గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆర్దరాత్రి ఆయన మరణించారు. మృతుడి మామ ఆవధానం వెంకట్రావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.