వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మండలి 45వ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన లఖ్నవూలో జరుగుతోన్న ఈ సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్య అధికారులు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. దాదాపు 20 నెలల తర్వాత మండలి సమావేశం మళ్లీ ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2019 డిసెంబరు 18 తర్వాత నుంచి జీఎస్టీ మండలి పలు సమావేశాలను వర్చువల్గా నిర్వహించిన విషయం తెలిసిందే.
కాగా.. పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశం ప్రధాన అజెండాగా నేటి సమావేశం జరుగుతున్నట్లు సమాచారం. 'పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయమై జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోవాలి' అని గత జూన్లో కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సుంకంతో సహా వ్యాట్ రూపంలో పెట్రోల్, డీజిల్పై ప్రస్తుతం రిటైల్ విక్రయ ధరలో 50 శాతం పన్నులే ఉంటున్నాయి. ఒకవేళ వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ఠ పన్ను 28 శాతంతో సహా ఫిక్స్డ్ సర్ఛార్జి ఉండే అవకాశముంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కొంత మేర తగ్గుతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఇక దీంతో పాటు కొవిడ్ ఔషధాలు, మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వంటి వాటిపై పన్ను మినహాయింపులను కొనసాగించే అంశంపైనా చర్చిస్తారని సమాచారం. మరోవైపు ఆహార డెలివరీ సేవలపైనా జీఎస్టీ విధించే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.