జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన సింగిల్ డోసు కరోనా టీకా తీసుకున్నవారిలో అరుదుగా నరాలపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) అప్రమత్తం అయింది. టీకాతో పాటుగా ఈ టీకా వినియోగానికి సంబంధించిన అనుమతుల పత్రంలో హెచ్చరికను జారీ చేస్తున్నారు. ఈ దుష్ప్రభావాన్ని గిలియన్-బారే సిండ్రోమ్గా పేర్కొంటారని నిపుణులు తెలిపారు.
అమెరికాలో ఇప్పటి వరకు 12.8 మిలియన్ల మందికి ఈ జాన్సన్ టీకా ఇచ్చారు. ఇందులోని 100 కేసుల్లో ఈ దుష్ప్రభావం తలెత్తినట్లు ఎఫ్డీఏ వెల్లడించింది. వీరిలో 95 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడగా ఒకరు మరణించినట్లు తెలిపారు. అయితే ఈ సమస్య అరుదైనది కావడం వల్ల జాన్సన్ టీకా వల్ల తలెత్తే సమస్యల కంటే ప్రయోజనాలే అధికమని స్పష్టం చేసింది. టీకా వేసుకోవాలని సూచించింది.