ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్స్లో భారత సారథి మిథాలీ రాజ్ రనౌట్ అయిన విషయం తెలిసిందే. 229 పరుగుల విజయ లక్ష్యంతో దిగిన భారత్ 5 పరుగుల వద్ద ఓపెనర్ స్మృతి మంధాన వికెట్ కోల్పోయింది. ఆమె స్థానంలో క్రీజులోకి వచ్చిన మిథాలీ ఇన్నింగ్స్ చక్కదిద్దే యత్నం చేసింది. అనవసర పరుగుకి పోయిన మిథాలీ.. జట్టు స్కోరు 43 వద్ద రనౌట్గా వెనుదిరిగింది.
13వ ఓవర్లో మార్ష్ వేసిన బంతిని పూనమ్ రౌత్ ఎదుర్కొంది. ఇద్దరు పరుగు తీసేందుకు యత్నించారు. ఈ క్రమంలో సహచరుల నుంచి బంతిని అందుకున్న వికెట్ కీపర్ టైలర్.. మెరుపు వేగంతో వికెట్లను పడగొట్టింది. దీంతో మిథాలీ తన వ్యక్తిగత స్కోరు 17పరుగుల వద్ద వెనుదిరగాల్సి వచ్చింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది అని అభిమానులు భావించారు. కానీ, వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఐతే తాజాగా మిథాలీ తన రనౌట్ అవ్వడానికి గల కారణాన్ని వెల్లడించింది.
పరుగు కోసం యత్నిస్తున్న క్రమంలో బూట్లు మైదానంలో కూరుకుపోవం వలనే తాను వేగంగా రన్ చేయలేకపోయానని మిథాలీ వెల్లడించింది. ‘బంతిని ఎదుర్కొన్న వెంటనే పూనమ్ పరుగు కోసం పిలిచింది. కానీ నా బూట్లు సహకరించలేదు. అవి మైదానంలో కూరుకుపోయాయి. అందుకే వేగంగా కదలలేకపోయా. ఫలితం రనౌట్ అయ్యా. తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడానని’ ఆమె తెలిపింది. ఈ మ్యాచ్లో భారత్ 9 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.