అమరావతి: తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకునే సంప్రదాయానికి టిటిడి మంగళం పాడింది.. దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు..మన సంస్కృతికి మూలం సనాతన ధర్మమేనని.. అలాంటి ధర్మ, సంప్రదాయాలు పాలకులు మారినప్పుడల్లా మారవని ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘మన సంస్కృతికి మూలం సనాతన ధర్మమే. “ఏషః ధర్మః సనాతనః” అన్నారు వాల్మీకి. సనాతనం అంటే ప్రాచీనమైన, నిత్యమైన, ఏ నాటికీ మారని శాశ్వత ధర్మం. అలాంటి ధర్మ, సంప్రదాయాలు పాలకులు మారినప్పుడల్లా మారవు. అలా మార్చాలనుకోవడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే. అసలు మతం అంటేనే నమ్మకం. ఎవరైనా సరే స్వామిపై నమ్మకంతో రావడం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు డిక్లరేషన్లు ఇచ్చే సంప్రదాయాన్ని పెట్టారు. ఒక నమ్మకంలేని వ్యక్తి కోసం అనాదిగా అనుసరిస్తున్న సంప్రదాయాన్ని మార్చడం అనాచారం, సమాజానికే అరిష్ఠం అది ఆధ్యాత్మిక ద్రోహం కూడా’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.