ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు వసతి కల్పిస్తామని ప్రకటించిన జిల్లా యంత్రాంగం దానిని వెనక్కి తీసుకుంది. ఆర్టీసీ ఉన్నతాధికారులను సంప్రదించకుండా ఉచిత బస్ ప్రయాణమనేే ప్రకటన చేయడం, ఈ అంశం ఆర్టీసీ ఎండీ దృష్టికి వెళ్లడం, కనీస బస్సు ఛార్జి వసూలు చేయాలనే ఆదేశాలు రావడంతో తిరిగి జిల్లా యంత్రాంగం ప్రకటన జారీ చేసింది. ఆర్టీసీ బస్సు ఎక్కే అభ్యర్థులు టికెట్ తీసుకోవాలని, ఉచితం సాధ్యపడదని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. దాంతో జిల్లాలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సాధారణ బస్సు ఛార్జీ చెల్లించాలని కలెక్టర్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.