బేతంచర్ల మండలంలో పండుగల్లో తలమానికమైన గణేష్ ఉత్సవాలు ఈసారి కోవిడ్-19 నిబంధనల మేరకే నిర్వహించుకునేలా భక్తాదులు ప్రజలు సహకరించాలని గణేశ్ ఉత్సవాల మండల కేంద్ర కమిటీ ప్రతినిధులు హుస్సేన్ రెడ్డి, పుల్లారెడ్డి, చంద్రమౌళీశ్వర రెడ్డి, నాగేశ్వర రెడ్డి శనివారం తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా జిల్లా కేంద్ర కమిటీ, అధికారుల ఆదేశాల మేరకు గణేష్ ఉత్సవాలను నిర్వహించుకునేలా మండల కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు బహిరంగ ప్రదేశాల్లో మండపాలు లేకుండా కేవలం ఆలయాల్లో మాత్రమే పరిమిత సంఖ్యలో 3 అడుగులు మించకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్టించించాల్సి ఉంటుందన్నారు.ఉత్సవాల్లో ఎలాంటి శబ్ద కాలుష్యానికి అనుమతులు ఉండవన్నారు. కేవలం సంప్రదాయక వాయిద్యాల నడుమ నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకు గాను అనుమతి పొందిన వారు మాత్రమే 22వ తేదీన విగ్రహాలను ప్రతిష్టించి 25వ తేదీన మధ్యాహ్నంలోగా సాంప్రదాయ వాయిద్యాల నడుమ ఆంజనేయ స్వామి ఆలయం మీదుగా భజన కార్యక్రమం ముగించుకోవాల్సి ఉంటుందన్నారు. నిమజ్జన కార్యక్రమం కోసం ఎలాంటి అల్పాహార ఏర్పాట్లకు అనుమతి ఉండదని వారన్నారు. కమిటీల నిర్వాహకులు ఈనెల 16వ తేదీలోగా కేంద్ర కమిటీ వద్ద పేర్లు నమోదు చేయించుకోవాలని వారు కోరారు. నిర్వాహకులు నిబంధనల మేరకు మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్లు వినియోగిస్తూ భౌతిక దూరాన్ని పాటించవలసి ఉంటుందని వారు తెలిపారు.