ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తమ్ కుమార్ పై సంచలన విమర్శలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 11:44 AM

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన విమర్శలు చేశారు. ఆయన నాయకత్వమే కొనసాగితే, రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ కు తేల్చి చెప్పారు. ఈ ఉదయం పార్క్ హయత్ లో డిగ్గీరాజాతో దాదాపు గంటపాటు భేటీ అయిన కోమటిరెడ్డి, ఇటీవలి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను చేసిన విమర్శలన్నీ నిజమేనని చెప్పారు. గత ఎన్నికల్లో ఉత్తమ్, పొన్నాల జోడీ విఫలమైందని అన్నారు. పీసీసీని, ఇంప్లిమెంటేషన్ కమిటీని తిరిగి వారికే అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన కోమటిరెడ్డి, నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోతుందని కావాలనే లీక్ చేశారని ఆరోపించారు. ఇంత జరిగినా తాను పార్టీకి సహకరిస్తునే ఉన్నానని, పార్టీని వీడే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదని, కావాలంటే సర్వే చేసి చూసుకోవాలని దిగ్విజయ్ కి కోమటిరెడ్డి సలహా ఇచ్చారు. ఈ విషయంపై ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత అధిష్టానం దృష్టిని సారిస్తుందని, అంతవరకూ విభేదాలు, విమర్శలు వద్దని దిగ్విజయ్ హితవు పలికినట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com