గ్రామాల్లో ఉంటున్న యువతులను ఉద్యోగాల పేరుతో పట్టణాలకు తీసుకెళ్లి లైంగికంగా హింసిస్తున్న సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఇంటి ఓ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ యువతిని తన మేనత్త ఉద్యోగం పేరుతో ప్రలోభపెట్టిన పట్టణానికి తీసుకుని రాగా కొందరు కామాంధులు ఆమెను ఓ హోటల్లో నిర్బంధించి రెండు నెలలుగా గ్యాంగ్ రేప్ కి పాల్పడుతున్నారు. ఈ దారుణ ఘటనపై సామాజిక కార్యకర్త రీనా రౌత్రాయ్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు సోషల్మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు.
ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె మేనత్త మార్చి నెలలో భువనేశ్వర్ లోని తన ఇంటికి తీసుకొచ్చింది. మార్చి 20న నందన్ అనే వ్యక్తి వద్దకు ఆమెను పంపింది. ట్రైనింగ్ పేరుతో నందన్ ఆమెను ఓ హోటల్ గదిలో ఉంచాడు. ఇంతలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ యువతి హోటల్ గదిలోనే ఉండిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న నందన్ రోజూ తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడేవాడు. తమకు సహకరించకపోతే చంపేస్తామని బెదిరించేవాడు. హోటల్ గదిలో ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో తనపై జరుగుతున్న ఘోరాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేకపోయింది. ఇటీవల ఆమె మేనత్త హోటల్ గదికి వచ్చింది. దీంతో ఆ యువతి మేనత్తతో గొడవ పెట్టుకుంది. దీంతో ఆమె మేనత్త యువతిని తోసేసింది. దీంతో ఆమెకు గాయాలై కటక్ ప్రభుత్వాసుపత్రిలో చేరింది. అక్కడి నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. వాళ్ళు ఉద్యోగం కోసం వచ్చి హాస్పిటల్ లో ఉన్న కూతుర్ని చూసుకుని తల్లడిలిపోయారు.