దేశంలో ఆర్థిక కుంభకోణాలు చాలానే జరిగాయి. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు చేయి కలిపి చేసిన స్కామ్ లే అధికం. అయితే కుంభకోణాలకు పాల్పడిన కొందరికి శిక్ష పడింది. మరికొందరు తప్పించుకుని విదేశాల బాట పట్టారు. ఇంకొందరు తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం దేశాన్ని కుదిపేసిన కుంభకోణాలలో ఒకటైన యూరియా కుంభకోణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా ఉత్కంఠను, కలకలాన్ని రేపిన యూరియా కేసుపై సర్వత్రా చర్చ జరిగింది. ఈ కేసుపై సిబిఐ ప్రత్యేక శ్రద్ధ కనబరిచినా పెద్దగా సంచలనాలు ఏవీ వెలుగులోకి రాలేదు. టర్కీ దేశం నుంచి దేశానికి అవసరమైన రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసేందుకు అక్కడి కంపెనీతో ఒప్పందం చేసుకుంది భారత ప్రభుత్వం. దీనికి గాను 38 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 133 కోట్ల రూపాయలు ముందే చెల్లించాలని ఒప్పందం. ఈ తతంగమంతా పూర్తి అయిన తర్వాత చూస్తే టర్కీలో అసలు కంపెనీయే లేదని తేలింది. ఇదీ ఈ కుంభకోణంలో కీలకం.కేసులు నమోదు చేసి... విచారణ ప్రారంభించినప్పటికీ అది నత్తనడకనే సాగింది. అటల్ బిహారీ వాజపేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో తూతూ మంత్రంగా సాగిన విచారణ ఆ తర్వాత యుపిఏ పాలనలో నీరుకారింది. ఇది మన రాజకీయ వ్యవస్ధకు అద్దం పట్టింది. అధికారంలో ఉన్న వారు ఎలాంటి చర్యలకైనా తెగబడతారని, ఎంతటి పెద్ద కుంభకోణమైనా పక్కదారి పట్టిస్తారని ప్రపంచానికి తెలియడానికి యూరియా కుంభకోణం కేసే ఓ పెద్ద ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా తెలుగు వాడు పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశాన్ని కుదిపేసిన యూరియా స్కాం కేసుకు తీర్పు వెలువడింది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న పి.వి.నరసింహారావు సమీప బంధువు సంజీవ రావుకు కోటి రూపాయల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.