కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశమంతా 21 రోజుల లాక్ డౌన్ పాటిస్తోంది. ఎటువంటి కార్యక్రమాలు, శుభకార్యాలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొందరు మాత్రం తాము అనుకున్న కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం లేదు. అనుకున్న సమయానికి ఏదో రకంగా కానిచ్చేస్తున్నారు. తాజాగా ఓ రెండు కుటుంబాల వారు వీడియో కాల్ ద్వారా తామనుకున్న రోజే తమ పిల్లల పెళ్ళి చేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలవుతుండటంతో ఏ ఒక్కరూ ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే ఓ జంట మాత్రం లాక్ డౌన్ వల్ల తమ పెళ్లిని వాయిదా వేయాలనుకోలేదు. ముందనుకున్న ప్రకారం నిర్ణయించిన రోజే పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు. కుటుంబ పెద్దల సమక్షంలో ఎవరి ఇంట్లో వాళ్లుండి తమ పెళ్లి చేసుకున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన మహ్మద్ మిన్హాజుద్ కు అదే ప్రాంతానికి చెందిన మహిళతో 6 నెలల క్రితం పెళ్లి నిశ్చయించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రధాని మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించారు. దాంతో ఫంక్షన్ హాల్స్ కూడా మూతపడ్డాయి. ఇక వారి పెళ్లి వాయిదాపడ్డట్లేనని అందరూ అనుకున్నారు. కానీ, వారు మాత్రం ఎలాగైన అనుకున్న టైంకే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తమ తమ కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో ఒకరినొకరు వీడియో కాల్ లో చూస్తూ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి గురించి వరుడి తండ్రి మొహమ్మద్ గయాజ్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ మన దేశంలో లేనప్పుడు ఈ పెళ్లి నిర్ణయించాం. ఇప్పుడు కరోనా వల్ల పెళ్లి ఆగకూడదనుకున్నాం. అందుకే మేం మా కుటుంబ పెద్దలను మాత్రమే సమావేశపరిచిపెళ్లిని ఫోన్ ద్వారా జరిపించాం. అనుకున్న సమయానికే పెళ్లి కావడం, తక్కువ ఖర్చుతో జరగడంతో ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని ఆయన తెలిపారు.