ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తున్న చంద్రబాబును వైజాగ్ లో అడుగుపెట్టనీయమోమని వైసీపీ శ్రేణులు ఎయిర్ పోర్టు ముందు ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు చంద్రబాబుకు వెల్ కమ్ చెప్పేందుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పార్టీల శ్రేణులు పోటాపోటీ నినాదాలతో విశాఖ ఎయిర్ పోర్టు పరిసరాల్లో నువ్వా.. నేనా అన్నట్లు తయారైంది. దీంతో పోలీసులు ఎయిర్ పోర్టు పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తాను విశాఖకు వస్తుంటే వీర్రాజు చెరువు వద్ద రోడ్డు తవ్వారని చంద్రబాబు ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కూడ తాను విజయనగరంలో పర్యటిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎయిర్ పోర్టు నుంచి పెందుర్తి వరకు టీడీపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.