ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింది కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈనెల 16న రామ్లీలా మైదానంలో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం రోజున ఆహ్వానించారు. ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై అధికారిక ప్రకటన వెలుబడాల్సింది. అయితే ఈసారి ప్రమాణస్వీకారానికి రాజకీయ పార్టీల ప్రముఖులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేజ్రీవాల్ ఆహ్వానించడం లేదు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలే అతిథులని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఈనెల 11న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో 70 స్థానాలకు గాను ఆప్ 62 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 8 సీట్లలో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ వరుసగా రెండోసారి ఖాతా తెరవలేదు.