ఆదాయపన్ను శాఖ దాడుల్లో వెలుగు చూసిన రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్కు తెలిసే అవినీతి జరిగిందని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా జరుగుతన్న ఐటీ దాడులను బట్టి ఈ విషయం స్పష్టమైందన్నారు. చంద్రబాబు హయాంలో పెద్ద కుంభకోణం జరిగిందని, నేరస్తుల మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత మాజీ కార్యదర్శి నివాసంలో సోదాలు చేస్తేనే రెండు వేల కోట్ల బయటపడితే.. చంద్రబాబు, లోకేశ్లపై దాడులు చేస్తే ఎన్ని వేల కోట్లు బైటపడతాయోనని ఆశ్చర్యపోయారు. చంద్రబాబు నాయుడు మీదనే కాదు టీడీపీ నాయకులు మీద కూడా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.