సరైన పెట్టుబడిదారు దొరికితే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నుంచి పూర్తిగా వైదొలిగేందుకు కేంద్రం సుముఖంగా ఉందని ఆర్థిక, రక్షణ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో జైట్లీ మాట్లాడుతూ ప్రస్తుతం విమానయాన మార్కెట్లో 84 శాతం ప్రైవేట్ రంగం చేతుల్లోనే ఉన్నప్పుడు వాటా 100 శాతానికి పెరుగకూడదనడానికి ఎలాంటి కారణాల్లేవు అని అన్నారు. దేశీయ విమాన రంగంలో ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా చాలా తక్కువ. కానీ సంస్థపై అప్పులభారం రూ.50 వేల కోట్ల స్థాయిలో ఉందని ఆయన తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం గతేడాది చివరినాటికి ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా 14.1 శాతానికి తగ్గి దేశంలోని అతిపెద్ద విమాన సంస్థల జాబితాలో మూడో స్థానానికి పరిమితమైందన్నారు. 39.8 శాతం మార్కెట్ వాటా ఉన్న ఇండిగో అగ్రస్థానంలో ఉండగా.. జెట్ ఎయిర్వేస్ 15.5 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉందని చెప్పారు. వాజ్పేయి హయాంలో విమాన మంత్రిగా పనిచేసినప్పుడు ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన ఫైలుపై సంతకం చేసినట్లు చెప్పారు. విమానయాన వ్యాపారంలో కొనసాగే అవసరం ప్రభుత్వానికి లేదు అని జైట్లీ తెలిపారు. సంస్థ భవిష్యత్పై ప్రస్తుత పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు నిర్ణయం తీసుకుంటారని, వారు అన్ని రకాల ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారని జైట్లీ తెలిపారు.