బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మారిషస్ ప్రధాని జగన్నాథ్ కు ప్రధాని ఇస్తున్న విందుకు నితీష్ కుమార్ హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, నిన్న సోనియా నేతృత్వంలో జరిగిన సమావేశానికి జేడీయూ తరపున శరద్ యాదవ్ హాజరయ్యారు. తాను ఈ నెల 20న సోనియాను కలిశానని, ప్రతిపక్షాల ఐక్యత, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి చర్చించానని చెప్పారు. మోడీతో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని నితీష్ స్పష్టం చేశారు. గంగానదిలో పూడిక ప్రమాదస్థాయికి పెరిగిందని, దానివల్ల వరదలు ముంచెత్తుతున్నాయని నితీష్ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తెచ్చి, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా కోరినట్లు నితీష్ చెప్పారు.