నవరత్నాలను అమలు చేయటంలో వైసిపి ప్రభుత్వం నానా ఇబ్బందులు పడుతోందన్నది వాస్తవం. కేంద్రం సాయం లేనిదే.. ఏపీ సర్కారు ఏం చేయలేనంత సందిగ్థం ఉందన్నదీ నిజం. ఇదే విషయాన్ని ఇటీవల కేసీఆర్తో జరిగిన చర్చల్లోనూ సిఎం జగన్ ప్రస్తావించినట్టు సామాజిక మీడియాలో పుంఖనాలుగా కథనాలు వచ్చాయి. వీటిని ఏపీ సీఎంఓ ఖండించినా, జగన్ను ఇరకాటంలో నెట్టేసివిగానే ఉన్నాయి. వీటిని కేవలం టీడీపీ ప్రచారం చేస్తుందని వైసిపి నేతలు గొంతు చించుకున్నా జనానికి కళ్లకెదురుగా కనిపిస్తున్న రివర్స్ టెండరింగ్, కరకట్టపై కూల్చివేతలు, పోటీపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజ్లు.. కోడెల ఆత్మహత్య. టీడీపీ కార్యకర్తలపై బహిరంగ దాడులు. కొత్తగా జర్నలిస్టులనూ వదలని వైసీపీ నేతలు ఇవన్నీ.. జగన్ను జనంలో పలుచన చేస్తున్నాయనే ఆందోళన స్వపక్షంలో కనిపిస్తోంది. ఇదంతా చట్టం పరిధిలో జరుగుతున్న వ్యవహారం అదే ప్లేస్లో మా వాళ్లున్నా.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనంటూ వైసీపీ శ్రేణులు సవాల్ విసురుతున్నా... అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న జగన్ దూకుడుకు కేంద్రం కళ్లెం వేసేందుకు సిద్ధమైందంటూ మరిన్ని కథనాలిప్పుడు వినిపిస్తున్నాయి
గత కేసుల ఉచ్చును బిగించటం ద్వారా జగన్ను నిలువరించాలని కేంద్రంచూస్తోందని దీనిలో భాగంగానే పక్కా ప్రణాళికతో పోలవరం, విద్యుత్ కొనుగోళ్లపై వైసీపీ సర్కారు చేస్తున్న వేగాన్ని కేంద్రం సున్నితంగా తిరస్కరిస్తూనే చట్టాన్ని అమలు చేసే పనిలో ఉందని తెలుస్తోంది.
ఇక వైసీపీ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల ప్రక్రియను కూడా జనం సీరియస్గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. మన వైసీపీ కార్యకర్తలనే 90 శాతం ఎంపిక చేసామని, ఇదంతూ మన పార్టీకి అనుకూలంగా మారిందంటూ స్వయంగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ సామాజిక మీడియాలో రావటం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి.
వీటితో పాటు ఇన్నాళ్లు ఆంధ్రులను దోపిడీదారులంటూ విమర్శల పరంపర వినిపించి పోలవరం వ్యతిరేకిస్తూ, కేసులు పెట్టించిన తెలంగాణ సీఎం కేసీఆర్తో జగన్ సామరస్య పరిష్కారాలు, అండ అవసరమంటూ చేస్తున్న దోస్తీ.. జరుపుతున్న చర్చలు ఏపీ ప్రజల్లో కాసింత అసహనం రేకెత్తిస్తున్నాయని విశ్లేషకులు చెపుతున్న మాట. ఇప్పటికే తెలంగాణలో ఏపీ కి చెందిన అధికారులు, సిబ్బందికి ప్రాధాన్యతలేని పోస్టింగ్ల్లో కూర్చోబెడుతుంటే, ఏపీలో మాత్రం తెలంగాణ నేతలు, అధికారులను నెత్తిన పెట్టుకుంటున్నారన్న వాదన కూడా ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. పైగా అనేక సున్నితమైన అంశాలను ఆచితూచి హ్యాండిల్ చేయాల్సిన జగన్ మంత్రివర్గం కూడా ఎదుటి పక్షంపైనా, రెచ్చగొట్టే ధోరణిలోనే వ్యవహరిస్తుండటం కూడా జగన్ పాలనపై ప్రభావం చూపుతున్నాయన్నది జనం మాట. ఆరునెలలో మంచి సిఎంగా పేరు తెచ్చుకుంటానన్న జగన్ వైసీపీ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత పెంచుతుందన్న ఆందోళన కార్యకర్తలలోనూ కనిపిస్తోంది.