నూతనంగా ఏర్పడిన టిటిడి ధర్మకర్తల మండలిలో ముగ్గురు సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ఛైర్మన్ మరియు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీవారి ఆలయంలో టిటిడి ట్రస్ట్ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్ ఉదయం 10:50 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, శ్రీమతి ప్రశాంతి రెడ్డి ఉదయం 11.00 గంటలకు ఆలయం ప్రమాణం స్వీకారం చేశారు. టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి బసంత్ కుమార్ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో గౌ..సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
అనంతరం ఆలయం వెలుపల ధర్మకర్తల మండలి సభ్యులు మీడియాతో మాట్లాడారు. శ్రీ చెవిరెడ్డి. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆస్థానంలో సేవలందించే అవకాశం 3వసారి తనకు రావడాన్ని పుర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నట్టు చెప్పారు. తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు సౌకర్యావంతమైన దర్శనం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. శ్రీ కృష్ణమూర్తి శ్రీవారి భక్తులకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీమతి వి. ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. బాధ్యతాయుతంగా తన విధులు నిర్వహించేందుకు కావాల్సిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సివిఏస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, డెప్యూటీ ఈవో (జనరల్) శ్రీమతి సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.