ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను విలీనం చేసి కేవలం నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేయాలన్నకేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్టు బ్యాంకు అధికారుల, ఉద్యోగుల సంఘాలు తెలిపాయి. ఈ మేరకు బ్యాంకు అధికారుల సంఘాలు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కు ఉమ్మడిగా నోటీసు పంపినట్టు ఉద్యోగ సంఘాలు మీడియాకు పంపిన ప్రకటనలో తెలిపాయి. ఆంధ్రాబ్యాంకు సహా దేశంలోని 10 పెద్ద బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా మార్చనున్నట్టు ప్రభుత్వం గత నెల 30న ప్రకటించిన విషయం తమకు అంగీకారం కాదని తేల్చి చెప్పాయి.
గతంలో ఇచ్చిన హామీ మేరకు నియంత్రిత పని గంటలు అమలు పరచాలని, వారానికి ఐదు రోజుల పని దినాలను అమలులోకి తీసుకు రావటంతో పాటు ఇప్పటి వరకు జరుగుతున్న నగదు లావాదేవీల వ్యవధిని తగ్గించడం ద్వారా ఉద్యోగులలో మరింత ఉత్తేజాన్ని కలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 25 అర్ధరాత్రి నుంచి 27 అర్ధరాత్రి వరకు సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే ఈ నెల 20న బ్యాంకుల విలీనం ప్రక్రియను నిరసిస్తూ పార్లమెంటు భవనం ఎదుట ధర్నా చేయాలని నిర్ణయిం తీసుకున్నట్టు బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక ప్రకటించింది. ధర్నా అనంతరం ఆర్థికమంత్రికి తాము వినతిపత్రం సమర్పిస్తామని తెలిపింది.