వంద రోజుల పాలనలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, పల్నాడులో బీజేపీ కార్యకర్తలను వేధింపులు ఎక్కువయ్యాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సోమవారం ఆయన గురజాల బయలు దేరే ముందు మీడియా ప్రతినిధులతో తన ఇంటిలో మాట్లాడుతూ... సీఎం జగన్ చెప్పేది ఒకటని.. చేసేది మరొకటన్నారు. ఇటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని ఇప్పటివరకూ చూడలేదన్నారు. పలనాడు ప్రాంతంలో వైసిపి నేతలు చేస్తున్న దారుణాలపై ప్రభుత్వానికి ఎన్ని సార్లు లేఖలు రాసినా స్పందన లేదన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో తగునీరు ఇబ్బంది అధిగమించేందుకు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గ్రామస్థులే రూ.25లక్షలు డొనేషన్లు వసూలు చేసుకుని 24ఎకరాలు కొనుగోలు చేసి వాటర్ ట్యాంక్ నిర్మించుకున్నారని, దీనికి ఫెన్సింగ్ కూడా ఏర్పాటుచేసుకున్నా. ఆ స్థలంలో కొంత భాగాన్ని వైసీపీ నేతలు సిరివరపు విజయభాస్కర్రెడ్డి, సూరం రమణ కబ్జా చేసి ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నిర్మించారని ఇదేమని అడిగితే బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎండోమెంటు భూములనువైసిపి నేతలు ఆక్రమించారని కన్నా పేర్కొన్నారు.
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యువతకు ఉద్యోగాలు ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టారని... కానీ ఆయన కుమారుడు సీఎం జగన్ మాత్రం ప్రజల పొట్టగొడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. పెళ్లి మహూర్తం పెట్టినట్లు ఇసుక పాలసీకి మహూర్తం పెట్టారన్నారు. ప్రభుత్వం పెట్టిన ముహూర్తానికి కూడా ఇసుక ఇవ్వలేకపోతున్నారని కన్నా విమర్శించారు. ఇసుకపై సరైన పాలసీ విధానం లేదని.. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పలనాడు నియోజకవర్గాలలో శాంతిభద్రతలు కంట్రోల్ చేయలేని పరిస్థితిలోలో ప్రభుత్వం ఉందా? అని కన్నా ప్రశ్నించారు.