గోదావరిలో లాంచి మునిగిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అన్నిచోట్ల సర్వీసు బోట్లను నిలిపివేయాలని ఆదేశించారు. నిపుణులతో మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. తూర్పుగోదారి జిల్లా కలెక్టర్లతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో పాటు, హెలికాఫ్టర్లను కూడా సహాయక చర్యల్లో వినియోగించాలని ఆదేశించారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని అధికారులకు చెప్పారు. బోటు నడిపే వారికి శిక్షణ ఉందా లేదా ? అన్నదానిపై విచారణ చేపట్టాలన్నారు. లాంచీ ప్రమాదంపై ఎప్పటికప్పుడు సీఎం ఆరా తీస్తున్నారు.
మరోవైపు లాంచీ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది. దేవీపట్నం లాంచీ ప్రమాదం నేపధ్యంలో విశాఖ జిల్లా పర్యాటకుల కోసం విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా నుంచి పాపికొండల టూర్ కి ఎవరైనా వెళ్లి ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 00002 కి వివరాలు తెలపాలని వారి కుటుంబ సభ్యులకి కలెక్టర్ వినయ్ చంద్ విజ్ణప్తి చేశారు. లాంచీ ప్రమాదంలో మొత్తం 24 మంది సురక్షితంగా బయట పెడినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో లాంచీ డ్రైవర్లు నూకరాజు, తామరాజు మృతి చెందారు. గోదావరిలో ప్రమాదానికి గురైన బోటు (లాంచీ)కు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాయల్ వశిష్ట బోటును ప్రయివేట్ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప్పుతున్నట్లు చెప్పారు.