కర్ణాటక రాజకీయం క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత రామలింగా రెడ్డి రాజీనామాను ఉపసంహరించుకున్న కొద్దిసేపటికే సంకీర్ణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. బెంగళూరులోని ప్రకృతి రిసార్టుల్లో ఉంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీమంత కుమార్ బాలాసాహేబ్ పాటిల్ బుధవారం రాత్రి కనిపించకుండా పోయారు.దీంతో పార్టీ శ్రేణులు కాంగ్రెస్ సీఎల్పీ నేత సిద్ధరామయ్యకు సమాచారం అందించారు. సీమంతకుమార్ పాటిల్ రాత్రి 8గంటల సమయంలో రిసార్టులో కనిపించారని, ఆతర్వాత ఆయన అదృశ్యమయ్యారని పార్టీ నేతలు తెలిపారు. ఈ సమయంలో ఆయన కోసం చుట్టు పక్కల ప్రాంతాలు, విమానాశ్రయంలో గాలించారు.
అయితే బెంగళూరులో మిస్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీమంత కుమార్ పాటిల్ ఇవాళ(జులై-18,2019)ఉదయం ముంబైలో ప్రత్యక్షమయ్యారు. ఛాతీ నొప్పి,రక్తపోటుతో ఆయన ముంబైలోని ఓ హాస్పిటల్ లో చేరారు. కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై చర్చ కొనసాగుతోంది.