గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక రాజకీయ సంక్షోభానికి గురువారం తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధం కావటంతో సోమవారమే విశ్వాస పరీక్ష పెట్టాలని భారతీయ జనతా పార్టీ నేతలు పట్టుబట్టినా స్పీకర్ నిరాకరించి గురువారం బల పరీక్ష కోసం అధికార పక్షానికి కొంత సమయం ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేల రాజీనామాలపై మంగళవారం సుప్రీం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆ తర్వాతే బలపరీక్ష పెడతామని చెప్పడం పట్ల బిజెపి భగ్గుమంటోంది.
ఇప్పటికే అసమ్మతి సభ్యులను కాంగ్రెస్ జెడిఎస్ లు బుజ్జగిస్తున్న నేపథ్యంలో విశ్వాస పరీక్షలో విజయం అందుకుంటామన్న ధీమా సంకీర్ణ సర్కారు వెల్లడిస్తోంది. మరి గురువారం ఉదయం 11 గంటలకు విధానసభలో నిర్వహించే విశ్వాసపరీక్షతో విజయమెవరదిదో తేలిపోనుంది.