దలైలామా వారసుడు తమ దేశం నుంచే రావాలని చైనా స్పష్టం చేయటంతో ప్రపంచ వ్యాప్తంగా బౌద్దులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.లామా వారసుడిని కచ్చితంగా చైనాలో నుంచే ఎన్నుకోవాలి అని టిబెట్ అటానమస్ రీజియన్ డైరెక్టర్ జనరల్ వాంగ్ చేసిన ప్రకటన వివాదస్పదమవుతోంది. వాస్తవానికి దలైలామా పునర్జన్మ అనేది చారిత్రాత్మక అంశంగా చూస్తారు. . ఇది ఎవరి వ్యక్తిగత అభిప్రాయానికీ సంబంధించినది కాదు. దీనికి ఒక ఎంపిక ప్రక్రియ ఉంది. దలైలామా వారసుడు ఈ ప్రక్రియ ద్వారానే ఎంపికవ్వాలి. కానీ ఇప్పుడిది రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన అంశంగా కూడా మారిపోవటంతో లామా ఎన్నికపై అటానమస్ రీజియన్ డైరెక్టర్ కచ్చితమైన వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యం ఏర్పడింది. పైగా భారత్లో బౌద్దం పుట్టినా సర్వ హక్కులు తమవేనన్న తీరుగా చైనా ప్రతినిధి ప్రకటన చేయటం, భారత్ జోక్యం చేసుకుంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించడంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది.