పాకాల మండలం ఊట్లవారిపల్లిలో శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామివారి ఆలయాన్ని దర్శించే భక్తుల కోసం టిటిడి నిర్మించిన యాత్రికుల వసతి సముదాయాన్నిఆదివారం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ రూ.95 లక్షల వ్యయంతో యాత్రికుల వసతి సముదాయాన్ని నిర్మించినట్టు తెలిపారు. శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామివారి ఆలయంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు చేసుకునే భక్తులకు ఈ సముదాయం సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇక్కడి ఆలయంలో కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని, పుష్కరిణి నిర్మించాలని స్థానిక భక్తులు కోరారని, ఇందుకోసం సహాయ సహాకారాలు అందిస్తామని వెల్లడించారు. టిటిడి కల్యాణమండపాలు, వసతిగృహాలు ఉన్న అన్నిచోట్లా శ్రీవారి విగ్రహం లేదా చిత్రపటం ఏర్పాటుచేసి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. టిటిడి కల్యాణమండపాలు, వసతిగృహాల్లో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. తిరుమలలో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు.
కాగా, 6,187 చ.అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 60 మంది భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా డార్మెటరీ ఉంది. మొదటి అంతస్తులో 2 ఎసి గదులతో కలిపి మొత్తం 11 విశ్రాంతి గదులు ఉన్నాయి.