కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాక ముందే దీని పరిస్థితి దినదిన గండంగా మారింది. కాంగ్రెస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రమేశ్ జార్కిహోళి, సుధాకర్ ఆదివారం బీజేపీ నేత ఎస్ఎం కృష్ణతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఫలితాల్లో బీజేపీ అక్కడ 25 స్థానాలు గెలుచుకోవడంతో అది కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై యడ్యూరప్ప కూడా ఉన్నట్లు సమాచారం. బెంగళూరులోని కృష్ణ నివాసంలో ఈ భేటీ జరిగింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలిద్దరూ పార్టీ మారాలనే యోచలో ఉన్నట్లు అందుకే బీజేపీ నేతలతో సమావేశం జరిగినట్లు వార్తలు రాగా వాటిని రమేశ్ తోసిపుచ్చారు. ఇది రాజకీయ పరంగా జరిగింది కాదని, లోక్సభ ఫలితాల్లో భాజపా ఘన విజయానికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినట్లు రమేశ్ తెలిపారు. అయితే రమేశ్ వ్యవహార శైలి కొన్ని రోజులుగా కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. జేడీఎస్ నేతలతో అతడికి సఖ్యత లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీంతో రమేశ్ పార్టీ మారే యోచనలో ఉన్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి. తర్వాత వీటిని ఆయన ఖండించారు. ఇప్పుడు మళ్లీ భాజపా నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.