కేంద్ర మంత్రి మండలి శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైంది. ఇందులో 16వ లోక్ సభను రద్దు చేయాలని సిఫార్సు చేయడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు సమాచారం అందించాయి. ఈ కేబినెట్ సమావేశం లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత రోజున జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి అద్భుత విజయం సాధించింది. కేబినెట్ సిఫార్సు తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలిసేందుకు ప్రధాని మోడీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. లోక్ సభ రద్దుకు సిఫార్సు చేస్తూ ప్రధాని తన రాజీనామాను, మంత్రివర్గ సభ్యుల రాజీనామాలను అందజేశారు. 16వ లోక్ సభ కాల పరిమితి జూన్ 3తో ముగియనుంది. కేబినెట్ సిఫార్సు అందుకున్న రాష్ట్రపతి కోవింద్ లోక్ సభను రద్దు చేయనున్నారు.