గుంటూరు జిల్లా గురజాలలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నామినేషన్ సందర్భంగా ఆయన అనుచరుడు వెంకటేశ్వర్లును హతమార్చేందుకు ముగ్గురు వ్యక్తులు పథక రచన చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు మారణాయుధాలతో సంచరిస్తుండగా వారిని అరెస్ట్ చేశారు. గుంటూరులో నిందితులను శనివారం మీడియా ముందుకు తీసుకువచ్చారు. శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు, శివకృష్ణ అనే ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి నాటు తుపాకులతో పాటు, ఐదు సెల్ఫోన్లు, స్కోడా కారు స్వాధీనం చేసుకున్నారు. పాతకక్షలు, భూ తగాదాలే ఘటనకు కారణమని ప్రాథమికంగా గుర్తించామని, కేసు లోతైన విచారణ నిమిత్తం పోలీసు కస్టడీ కోరనున్నామని గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పల్నాడు ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు.