న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. శుక్రవారం బీజేపీలో చేరిన గౌతీ.. ఇక రాజకీయాల్లో బిజీ కానున్నాడు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, అరుణ్ జైట్లీ.. గంభీర్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అతను పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తనను పార్టీలో చేర్చుకున్నందుకు గంభీర్ కృతజ్ఞతలు చెప్పాడు. మోదీని చూసి తాను స్ఫూర్తి పొందానని అన్నాడు. క్రికెట్లో నాకు చేతనైనంతగా దేశానికి సేవలందించాను. ఇక ఈ రంగంలోనూ నా వంతుగా దేశానికి సేవలందిస్తాను అని పార్టీలో చేరిన తర్వాత గంభీర్ తెలిపాడు. 37 ఏళ్ల గంభీర్.. గతేడాది డిసెంబర్లో క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. 13 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గౌతీ.. టీమిండియా 2011 వరల్డ్కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. టెస్టుల్లో 9, వన్డేల్లో 11 సెంచరీలు చేశాడు. ఈ మధ్యే పద్మశ్రీ అవార్డు కూడా అందుకోవడం విశేషం. కాస్త జాతీయ భావాలు ఎక్కువగా ఉండే గంభీర్.. బీజేపీలో చేరబోతున్నాడని గతేడాది నుంచి వార్తలు వస్తున్నాయి.