ఇప్పటివరకూ ఏ ప్రభుత్వంలోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత లేదని ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిగా పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార దిశగా ముందుకు సాగుతానని కోరాడ ఫౌండేషన్ ఛైర్మన్ కోరాడ విజయ్కుమార్ అన్నారు. జెండాచెట్టు వీధిలోని తన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరాడ విజయ్కుమార్ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కోరాడ ఫౌండేషన్ తరఫున తాను పశ్చిమ నియోజకవర్గంలో తాను ఈ నెల 21న 41వ డివిజన్లోని ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించునున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పాదయాత్ర సాగుతుందని ఈ పాదయాత్ర ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీల అభ్యున్నతికి ఎలా కృషి చేయాలి, కొత్త ఒరవడితో ఏ విధంగా ముందుకు సాగాలో నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పేదలు, బలహీన వర్గాలు 85 శాతం ఉన్న పశ్చిమనియోజకవర్గంలో ఏ ప్రభుత్వంలోనూ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందకపోవడం విచారకరమన్నారు. ప్రధాన సమస్యలు సైతం ముఖ్యమంత్రి స్థాయిలో దృష్టి సారించాల్సిన దయనీయ పరిస్తితి నెలకొందన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం పూర్తిస్థాయిలో మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తనకు మద్దతుగా పలు కులసంఘాల నాయకులు ముందుకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల రణరంగంలో ప్రజలు తనకు ఇదే విధంగా సహకారం అందించాలని కోరారు. తనకు ప్రత్యర్థులు ఎవరూ లేరని, సామాన్యుడే తన ఎజెండా అని పేర్కొన్నారు. ఏ పార్టీ అయినా నామినేటేడ్ పోస్టులు, ఛైర్మన్ పోస్టులు ఇస్తామనే చెబుతుందని కానీ బీసీల అభ్యున్నతి కోసం బీసీని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వడంలేదన్నారు. జనాభా ప్రాతిపదికన థామాషా ప్రకారం పేద ప్రజలు ఎక్కవగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థులను ఏ ప్రభుత్వం కూడా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ విధంగా ముందుకు రాలేదన్నారు. కోరాడ విజయ్కుమార్ తీసుకున్న నిర్ణయం ప్రజల సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నాయకులందరూ ఇదేవిధంగా ప్రజల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కమ్యూనిస్టుల త్యాగాల కోసం కోరాడ కుటుంబం గతంలో ఎంతో పోరాటం సాగించిందని గుర్తుచేశారు. విలేకరుల సమావేశంలో పలు సంఘాల నాయకులు బాడిత శంకర్, పోతిన బేసుకంఠేశ్వరుడు, ఏలూరి వెంకన్న, మహ్మద్ అప్సర్, నమ్మి భాను, గునుపూడి నగేష్, పట్నాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు.